PRIVACY ALERT: యాప్లకు గుడ్డిగా 'అలౌ' చేస్తున్నారా? మీ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంది!
How to Safely Install an App? : ఎవరికి పడితే వారికి అడగ్గానే మన వివరాలన్నీ ఇస్తామా? వాటిని ఉపయోగించుకుంటామంటే సరేనని అంటామా? మనకు తెలియకుండానే వాడేసుకుంటుంటే అంగీకరిస్తామా? లేదు కదా. అలాంటి వారు కనిపిస్తే అప్రమత్తం అవుతాం కదా. వ్యక్తులతోనే కాదు ఆధునిక సమాజంలో డిజిటల్ శక్తుల విషయంలోనూ ఆ అప్రమత్తత మరింత తప్పనిసరి అవుతోంది! అందుకే తస్మార్ట్ జాగ్రత్త!
ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది. లోన్ యాప్లో రుణం తీసుకున్నావని, వెంటనే రూ.10,000 కట్టాలని కోరారు. తాను తీసుకోలేదని అతడు చెప్పినా వినిపించుకోలేదు. విద్యార్థి తండ్రికి ఫోన్ చేశారు. వెంటనే రూ.10,000 కట్టకపోతే కుమారుడి ఫొటోలు నగ్నంగా మారుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయం ఏంటో తండ్రి కనుక్కునేలోపే ఫొటోను అర్ధనగ్నంగా మార్చేశారు. అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా తమ ఫొటోలు, ఫోన్ నంబరు వారికి ఎలా చేరాయన్నది అంతుబట్టలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. వ్యక్తిగత డేటాను కొనుగోలు చేసి దాని ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఇవి చేస్తున్నట్లు గుర్తించారు.
డేటా చోరీ - ఏం జరుగుతుందంటే :
మనం ప్రతి అవసరానికీ ఫోన్ మీదనే ఆధారపడుతున్నాం. ఆహారం, షాపింగ్, బ్యాంకింగ్, ట్యాక్సీ, ఇంటి పన్ను, వినోదం, టీవీ రీఛార్జీ ఇలా వేరు వేరు పనుల కోసం ఫోన్లో పదుల సంఖ్యలో యాప్లు డౌన్లోడ్ చేస్తున్నాం. వాటి పని తీరు, డేటా సేకరణ వివరాలు మాత్రం సమగ్రంగా తెలుసుకోవడం లేదు. ఇక్కడే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నాం.
ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు కోరుతుంది. అవసరం లేకున్నా గ్యాలరీ, లొకేషన్, మైక్రోఫోన్, కాంటాక్టులు ఇలా అన్ని అనుమతులు ఇచ్చేస్తాం. ఇలా అన్ని వివరాలను యాప్ తయారీదారులకు ఇచ్చేస్తాం.
ఈ డేటాను యాప్ సృష్టికర్తలు ఎవరికి ఇస్తున్నారో మనకు తెలీదు. ఫలితంగా వ్యక్తిగత డేటా అంగట్లో సరకులా మారిపోయింది.
కొన్ని రకాల చైనీస్ యాప్లకు అనుమతులు ఇస్తే ఫోన్లోని వీడియోలు, ఫొటోలను, గుట్టుగా సేకరిస్తాయి. మన ప్రమేయం లేకుండానే కాపీ చేసి ఆ డేటాకు ధర నిర్ణయించి అమ్మేస్తుంటాయి.
సైబర్ నేరాలు - ఎలా జరుగుతాయి :
ఇవి వేరు వేరు మార్గాల్లో సైబర్ నేరగాళ్లు, లోన్యాప్ల నిర్వాహకులకు చేరతాయి. వీటిని మార్ఫింగ్, డీప్ఫేక్ పద్ధతుల్లో అసభ్యంగా మార్చి నేరగాళ్లు బెదిరించి నగదు డిమాండ్ చేసే అవకాశం ఉంది.
చాట్ జీపీటీలో జిబ్లీ ట్రెండ్ రాగానే ఫొటోలు మార్చుకుని ఎంతోమంది సంబరపడ్డారు. ఏఐ విధానంలో ఫొటోలు మార్చుకోవడం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రముఖ గేమింగ్ యాప్ బీజీఎంఐ వ్యక్తిగత డేటాను సేకరించి విదేశాలకు అమ్మేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి డేటాను రూ.2000 విక్కయిస్తోందని మహారాష్ట్రలో పోలీసు కేసు నమోదు చేశారు.
సురక్షితంగా ఉండాలంటే - ఇప్పుడు ఏం చేయాలి :
- ఏదైనా యాప్ అధీకృత ఐస్టోర్,ప్లేస్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. లింకులు, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చేవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయకూడదు. కొత్త యాప్ల రేటింగ్, యూజర్ల ఫీడ్బ్యాక్ను బ్యాక్గ్రౌండ్లో పరిశీలించాలి.
- డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి ప్రైవసీ పాలసీ విధానాలు కచ్చితంగా చదవండి. ఏమేం డేటా సేకరిస్తోంది? దాన్ని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయా? సొంతంగా భద్రపరుస్తాయా? అనేవి తెలుసుకోవాలి.
- కొన్ని యాప్లు అవసరం లేకున్నా మైక్రోఫోన్, గ్యాలరీ, కెమెరాలకు అనుమతులు కోరతాయి. ఇలాంటి వాటిని వాడకపోవడం మేలు. మనం ఏ అవసరం కోసం వాడుతున్నామో దానికి మాత్రమే అనుమతి ఇవ్వాలి.
- యాప్ అనుమతులు కోరేటప్పుడు ఓన్లీ దిస్ టైమ్, వైల్ యూజింగ్ ది యాప్, డోంట్ అలౌ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి వాడే యాప్ అయితే ఓన్లీ దిస్ టైమ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.
- ఫొటో, వీడియో ఎడిటింగ్ యాప్లు వాడేటప్పుడు పూర్తి స్థాయి అనుమతికి బదులు ఓన్లీ వన్స్ ఆప్షన్ వాడాలి. దీనివల్ల అప్పటి వరకే యాప్ డేటా తీసుకోగలుగుతుంది.
- ఫోన్లు, యాప్ల లోపాల సవరణకు వచ్చే అప్డేట్లను ఉపయోగించుకోవాలి.
- ఫోన్ సెట్టింగ్స్లో పర్మిషన్ మేనేజర్ విభాగం ఉంటుంది. ఇందులో యాప్లకు ఇచ్చిన అనుమతుల వివరాలు ఉంటాయి. అవసరం లేకుండా అనుమతులు ఇచ్చి ఉంటే మార్చుకోవచ్చు.
- బ్యాక్గ్రౌండ్లో నడిచే యాప్లు ఉంటాయి. ఇవి అవసరం లేకుంటే ఫోన్ నుంచి తీసేయాలి.
మా తాజా అప్డేట్స్ను మీ మొబైల్లో పొందేందుకు మా వాట్సాప్ గ్రూప్లో చేరండి: https://chat.whatsapp.com/JhNotK0NYLA0Bqhte0UaaZ
0 Comments